వంశధార... సముద్రం పాలు..!
● జిల్లాలో 16 టీఎంసీలే వినియోగం
● లక్షల క్యూసెక్కులు సముద్రంలో
కలుస్తున్న వైనం
● పట్టాలెక్కని కొత్త ప్రాజెక్టులు
● నత్తనడకన ఎత్తిపోతల పథకం
హిరమండలం: జిల్లాలో అపార సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ సద్వినియోగం చేసుకోవడం మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతోంది. ఏటా వంశధార, నాగావళి, మహేంద్రతనయా, బాహుదా నదులు నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. దీనిని నివారించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన కుమారుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు చొరవ తీసుకున్నారు. కానీ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు అంతగా సానుకూలంగా వ్యవహరించలేదు. ప్రధానంగా వంశధార విషయంలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణం చేపట్టగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ రిజర్వాయర్కు నీరు అందించేందుకు ఏకంగా గొట్టా బ్యారేజీలోనే ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకున్నారు. ఒడిశాతో సరిహద్దు జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవచూపారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సానుకూల నిర్ణయం కూడా తీసుకోలేదు.
పట్టించుకోని పాలకులు
వంశధార నుంచి లక్షలాది క్యూసెక్కులు, వందలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా పాలకుల్లో చలనం రావడం లేదు. 2005లో వృథా జలాలను ఒడిసిపట్టాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నారు. 19 టీఎంసీల సామర్థ్యంతో హిరమండలం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించారు. ఈ 20 ఏళ్లలో 93 శాతం పనులు పూర్తి చేసుకొని రిజర్వాయర్కు ఒక తుది రూపం వచ్చింది. అయితే కొత్తూరు, భామిని మండలాల్లో వరద కాలువలు, మినీ రిజర్వాయర్ల నుంచి ఆశించిన స్థాయిలో నీరు రిజర్వాయర్లోకి చేరడం లేదు. దీంతో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. భామిని మండలం కాట్రగడ, సింగిడి వద్ద రిజర్వాయర్ను నిర్మించి అక్కడ నుంచి జలాలను వంశధార ఫేజ్–2లోకి తరలించాలని నిర్ణయించారు. కానీ ఒడిశా అభ్యంతరాలతో అప్పటికప్పుడు గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకాన్ని రూ.175 కోట్లతో నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులను సైతం ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.
ఇదీ పరిస్థితి
వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా ప్రస్తుతం 12 మండలాల్లో 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందుకుగాను వినియోగిస్తున్న నీరు 13.38 టీఎంసీలు. కుడి ప్రధాన కాలువ ద్వారా 68 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీనికి 2.69 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఒక్క అక్టోబరు నెలలోనే 47.7 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయిందంటే ఎంతమేరకు నీరు వృథాగా పోతోంది అనేది అర్థమవుతోంది. అందువలన ఇప్పటికై నా కూటమి పాలకులు మాటలు చెప్పకుండా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని సద్వినియోగమయ్యేలా చూడాలి. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
ఉపయోగిస్తే సస్యశ్యామలమే
ఏటా వంశధార నది నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. వాటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా 1962లో వంశధార నదిలో నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు. ఏటా 105 టీఎంసీల వరకూ నీరు పారుతోందని లెక్క కట్టారు. అందులో చేరో సగం అంటే 52.5 టీఎంసీలు వాడుకునేందుకు నిర్ణయించారు. కానీ ఏ ఒక్క ఏడాది కూడా పూర్తిస్థాయిలో నీరు వాడుకున్న దాఖలాలు లేవు. గత నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒక్క అక్టోబర్ 3వ తేదీనే లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబరు నెలలో సముద్రంలో వృథాగా కలిసిన జలాలు అక్షరాలా 47.7 టీఎంసీలు ఉన్నట్లు అంచనా.
ప్రభుత్వానికి నివేదించాం
నదుల అనుసంధానం అనేది ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది నాటికి అన్ని పనులు పూర్తిచేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తాం. – బి.రవీంద్ర, ఈఈ,
వంశధార కన్స్ట్రక్షన్ డివిజన్, హిరమండలం
వంశధార... సముద్రం పాలు..!
వంశధార... సముద్రం పాలు..!


