
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: అప్పుల బాధ తట్టుకోలేక తంప గ్రామానికి చెందిన డోల దొరబాబు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ధనుపురం గ్రామ సమీపంలో స్పైసీ దాబా నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట వ్యాపారం కోసం అప్పులు చేశాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దొరబాబుకు భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహ్మద్ యాసిన్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వజ్రపుకొత్తూరు : కొండవూరు గ్రామానికి చెందిన కొరికాన చైతన్య(29) అనే యువకుడు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పూండి నుంచి పలాస బైక్పై వెళుతుండగా బెండిగేటు సాయిబాబా గుడి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చైతన్య సీమేన్గా పనిచేస్తున్నాడు. తమ్ముడు హరీష్తో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లితండ్రులు గున్నయ్య, అమ్మన్నలు ఏడేళ్ల క్రితమే చనిపోయారు. చైతన్యకు జూలై 31న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే మృతిచెందడంతో విషాదఛాయలు అలముకున్నా యి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్ఐ రమణా రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పాముకాటుకు చిన్నారి మృతి
కంచిలి: మకరాంపురం గ్రామానికి చెందిన గుడియా సాయిసా(10) అనే చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. గుడియా పూర్ణచంద్ర–గీత దంపతుల కుమార్తె సాయిసా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బరంపురం ఎం.కె.సి.జి. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. సాయిసా స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి పూర్ణచంద్ర టిఫిన్ హోటల్లో హెల్పర్గా, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నారి సాయిసాతోపాటు కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జాతీయ కబడ్డీ పోటీలకు సిక్కోలు క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: మొదటి జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు చెందిన సత్తారు రామ్మోహనరావు (అక్కులపేట, ఆమదాలవలస మండలం), పోతనపల్లి యమున (పల్లిసారథి, పలాస మండలం) ఎంపికయ్యారు. ఈ పోటీలు జూన్ 29 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే వీరు ఏపీ జట్లతో కలిసి హరిద్వార్ చేరుకున్నారు. వీరి ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాధు ముసలి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాధు శ్రీనివాసరావు, కోశాధికారి నాగళ్ల రమేష్, మెట్ట తిరుపతిరావు, కబడ్డీ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పోటీల్లోనూ సత్తాచాటి జిల్లాకు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మెరుగైన ప్రదర్శన కనబరాలన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య