
సచివాలయ బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట!
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
గ్రామీణ వ్యవసాయ సహాయకులు (వీఏఏ)ల బదిలీల ప్రక్రియ శనివారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించారు. పేరుకే వెబ్ కౌన్సెలింగ్ అయినా చేసేదంతా సిఫార్సు లేఖలకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగు లకు బదిలీ జీవో ఇచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు పేషీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఓ జాబితా తయారుచేసి జిల్లా వ్యవసాయాధికారి చేతిలో పెట్టినట్లు సమాచారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 557మంది వీఏఏలు ఉండగా వీరిలో 18 మంది వివిధ పరిస్థితులు దృష్ట్యా బదిలీల్లో ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు. మిగిలిన వారికి నిబంధనలు, పారదర్శకంగా బదిలీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తమకు కావాల్సినవారికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే లేఖలు ఇచ్చి సిఫార్సులున్నవారికే నచ్చిన చోటకి బదిలీ చేస్తున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. మొదటి రోజు 150 మందికి కౌన్సిలింగ్కు పిలవగా.. మిగిలినవారికి ఆది, సోమవారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది.
మున్సిపాలిటీల్లో 300 మందికి పైగా బదిలీ..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి శ్రీకాకుళం కార్పోరేషన్, ఆమదా లవలస, రాజాం, పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం కమిషనర్లు ఆధ్వర్యంలో పనిచేస్తున్న వార్డు అడ్మిని స్ట్రేటివ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలకు సైతం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. వార్డు ఎమినిటి సెక్రటరీలకు మా త్రం పబ్లిక్ హెల్త్ సూపరింటిండెంట్ ఆఫీస్ విశాఖ పట్నం నుంచి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించా రు. అన్ని విభాగాల్లో కలిసి సుమారు 300 మందికి పైగా బదిలీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. అధిక సంఖ్యలో సిఫార్సు లేఖలకే ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది.