
పకడ్బందీగా లింగ నిర్ధారణ చట్టం అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, లింగ నిర్ధారణ చట్టం అమలులో ఎలాంటి విడుపులూ లేకుండా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. లింగ నిర్ధారణ చేసి గర్భస్రావానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ నిర్వహించిన సర్వే ప్రకారం 2019–21లో 1000 మందికి పురుషులకు 1163 మంది సీ్త్రలు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించామని, లింగ నిర్ధారణ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పేద ప్రజలకు సత్వరం వైద్య సేవలను అందించే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా 387 కేసులలో అభిప్రాయం కోరగా 20 కేసులలో ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేశాయని ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, డీఐఓ రామ్దాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీ కాథరిన్, ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ వెంకట్రావు, డీపీఎంవో బి.రవీంద్ర, ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.వి.లక్ష్మి, స్వర్ణలత, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ఎన్.ప్రసాదరావు, డిప్యూటీ డీఈఎంఓ వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ ప్రకాష్రావు, కిమ్స్ ఆస్పత్రి ఏవో సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.