
గాలికొదిలేస్తారా?
ఊరిని వదిలేసి వస్తే..
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సొంత ఇల్లు, భూములు.. ఇలా సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు కూటమి పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా గాలికొదిలేస్తున్నారు. తమ గోడు పట్టించుకునే వారే లేకపోవడంతో నిర్వాసిత కాలనీవాసులు కుమిలిపోతున్నారు. తరతరాలుగా జీవిస్తున్న ఇళ్లు, భూములను వదులుకుంటే తమనే నట్టేట ముంచుతారా?అంటూ సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం గ్రామస్తులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణానికి భూములతో పాటు గ్రామాన్నే త్యాగం చేసిన విష్ణుచక్రం గ్రామస్తులు తమకు కేటాయించిన పునరావాస కాలనీలో కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటం, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామానికి నౌపడలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల భూమి ఇచ్చారు. ఇందులో తాత్కాలిక షెడ్లను వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 57 రేషన్ కార్డులు ఉండగా 45 మందికి మాత్రమే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంపై మిగిలిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాలనీలో మౌలిక వసతులు కొరవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకం నిర్మాణంలో ఉండటంతో తలగాం నుంచి పైపులైన్ ద్వారా వస్తున్న నీరు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కాలనీలో ఎర్త్పిల్లింగ్ పూర్తిస్థాయిలో చేయకుండా వదిలేయడంతో చిన్నపాటి వర్షాలకు నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీరు ప్రవహించేందుకు కాలువలు లేకపోవడంతో వాడుక నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో రోడ్డు బురదమయంగా తయారై దోమలకు నిలయంగా మారింది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెవెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. రాత్రి వేళల్లో పాములు సంచరించడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
పెండింగ్లో పరిహారం..
గ్రామంలో ఉన్న మరిడమ్మ తల్లి ఆలయానికి, అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. పోర్టు రైల్వేలైన్, రోడ్డు మార్గానికి మధ్యన ఉన్న 40 ఎకరాల గ్యాప్ ఏరియాకి ఇంతవరకు పరిహారం అందజేయలేదని గ్రామస్తులు అంటున్నారు.
రౖడైనేజీ వ్యవస్థ లేదు..
పునరావాస కాలనీలో వసతులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేక వాడుక నీటితో పాటు చిన్నపాటి వర్షాలకు ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. ఇల్లు చుట్టూ నీరు చేరి బురదమయంగా మారుతోంది. ఈగలు, దోమలకు నిలయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పునరావాస కాలనీలో గుడి నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి.
– గిన్ని శ్యామ్సుందర్రావు,
విష్ణుచక్రం గ్రామం, సంతబొమ్మాళి మండలం
ఇబ్బంది పడుతున్నాం..
పునరావాస కాలనీలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. మట్టివేసి ఎత్తు చేయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
– గిన్ని ముత్తమ్మ, విష్ణుచక్రం గ్రామం,
సంతబొమ్మాళి మండలం
విష్ణుచక్రం నిర్వాసిత కాలనీలో కనీస సౌకర్యాలు కరువు
మూలపేట పోర్టు కోసం
సర్వం వదులుకున్న గ్రామస్తులు
కాలువలు, తాగునీరు వంటి
సదుపాయాలు లేక ఇక్కట్లు
పట్టించుకోని కూటమి సర్కారు

గాలికొదిలేస్తారా?

గాలికొదిలేస్తారా?