
పాపం.. ఎంటీఎస్ టీచర్లు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఎన్నో అవాంతరాలు, ఆవేదనలు, ఆక్రందనల నడుమ జిల్లాలో ఎట్టకేలకు మినిమం టైమ్ స్కేల్(ఎంటీఎస్) టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్ పూరయ్యింది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున నేపథ్యంలో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. ఇటీవల ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో సమీప ప్రాంతాల్లోని స్కూళ్లలో పోస్టులను ఎంపికచేసుకున్నారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలు, సదూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే పోస్టులు ఖాళీగా మిగిలాయి. దీంతో గత్యంతరం లేక ఆ పోస్టులనే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు వచ్చే అరకొర జీతాలతో.. సుదూరంతాలకు రాకపోకలు ఎలా సాగించగలమని, ఎలా పనిచేయగలమని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
371 మందికి కౌన్సెలింగ్ పూర్తి..
జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్ ముగిసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా అదివారం ఉదయం 8 గంటలకు మొదలుకావాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం మొదలైన కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న ఎంటీఎస్ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పాఠశాల్లో ఖాళీలు బట్టి వీరికి స్థానాలు ఖరారు చేశారు. జిల్లాలో 1998 డీఎస్సీ బ్యాచ్కు చెందిన 261 మంది, 2008 డీఎస్సీ బ్యాచ్ 110 మంది కలిపి మొత్తం 371 మంది ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. ఇద్దరు గైర్హాజరైనప్పటికీ.. వారికి ఫోన్లోనే పలు స్కూళ్ల ఖాళీలను తెలియజేసి కౌన్సెలింగ్ కానిచ్చారు. జిల్లాలో 371 మందికి 410 ఖాళీ పోస్టులను చూపించారు. మాన్యువల్ పద్ధతిలో జరిగిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి తదితరులు పర్యవేక్షించారు.
విభజించి.. పాలించేలా..
ఎంటీఎస్ టీచర్ల పరిస్థితి ముందుగొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది. వారిలో వారికే తగాదాలు సృష్టించి.. విభజించి, పాలించూ అన్న చందంగా తయారుచేసింది కూటమి ప్రభుత్వం. గ్రూపు తగాదాలు సృష్టించి, తారతమ్యాలు వచ్చేలా చేసింది. తమకే ముందు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఈ రెండు బ్యాచ్ల ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటలసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం 2008 డీఎస్సీ ఎంటీఎస్లకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవ నేపథ్యం అందుకు భిన్నంగా ఉంది. 1998 బ్యాచ్ ఎంటీఎస్లే సీనియారిటీలో ముందుంటారనేది వారి వాదన. మొత్తమ్మీద విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించి చివరకు 2008 ఎంటీఎస్లకు, ఆ తరువాత 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంటీఎస్ టీచర్ల ఇంటి చిరునామాకు సమీపంలోగానీ, వారి మండల పరిధిలోని పాఠశాలల్లో పోస్టింగులు ఇచ్చి బాసటగా నిలిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు.
ఉన్న చోటు నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీ
అరకొర జీతాలతో అంతదూరం వెళ్లి ఎలా పనిచేయగలమని ఆవేదన
న్యాయం చేయాలని వేడుకోలు
జిల్లాలో 371 మందికి కౌన్సెలింగ్ పూర్తి

పాపం.. ఎంటీఎస్ టీచర్లు!