
హామీలపై మంత్రి అచ్చెన్న సమాధానమివ్వాలి
టెక్కలి: ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహన్రావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం జక్కరపేటలో ఆదివారం సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అప్పులు తప్ప ప్రయోజనం ఏమీ లేదన్నారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేదని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, జీడి బోర్డు ఏర్పాటు చేయలేదని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూములకు నీరు అందజేస్తామని చెప్పినా అమలు కావడం లేదన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం ఎందుకు అందజేయలేకపోతున్నారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, యు.లక్ష్మణరావు, దుర్గాప్రసాద్, బి.అప్పారావు, బి.రవి, హరీష్, బి.నరసమ్మ, సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.