
రిజర్వాయర్లో పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
మందస: కొంటాసాయి గిరిజన గ్రామానికి చెందిన సవర థ్రిల్లర్ మంజు(16) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి రిజర్వాయర్లో ప్రమాదశాత్తుపడి దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంటాసాయి గ్రామానికి చెందిన సవర సుబ్బారావు కుమారుడు థ్రిల్లర్ మంజు పలాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పశువులను మేపేందుకు డబార్సింగి జలాశయం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ స్నానానికి దిగి ఈత రాక మునిగిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి జలాశయం వైపు వెళ్లి వెతకగా నీటిలో విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.