
రన్.. అదిరెన్
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో ఒలింపిక్ డే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి క్రీడాజ్యోతిని వెలిగించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాతబస్టాండ్ నుంచి వైఎస్సార్ సర్కిల్, పాలకొండా రోడ్, డే అండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వరకు సాగింది. యువ, వర్ధమాన క్రీడాకారులతోపాటు క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు, పీడీలు, కోచ్లు, వెటరన్ ఆటగాళ్లు పాల్గొన్నారు.
విశ్వవ్యాప్త గుర్తింపు క్రీడాకారులకే సొంతం: దాసన్న
అనంతరం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దే శించి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. క్రీడలు చదువులో భాగంగానే చూడాలనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. జిల్లాలో క్రీడాకారుల ప్రతిభకు కొదవలేదని, వారిని మరింతగా ప్రోత్సహించాలన్నారు. ఈరోజు విశ్వవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం దక్కేది క్రీడాకారులకేనని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఖిల్లాగా గుర్తింపు పొందిందని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు సైతం ముందుకు రావాలని కోరారు. కోడిరామ్మూర్తి స్టేడియం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఎంవీ పద్మావతి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు మాస్టారు, ఎండీ కాసీంఖాన్, చిట్టి నాగభూషణం, కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి కె.మాధవరావు, చల్లా జగదీష్, శ్రీనివాసరావు, గాలి అర్జున్రావురెడ్డి, ఆనంద్కిరణ్, భాస్కరరావు, సతీ ష్రాయుడు, రవికుమార్, వెంకటరమణ, ఆనంద్, లక్ష్మీనారాయణ, డీఎస్ఏ కోచ్లు, పీడీ, పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులు, వాకర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ముఖం చాటేసిన అధికార పార్టీ నాయకులు
ఒలింపిక్ డే రన్కు కూటమి పార్టీల నాయకులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరోసారి దూరంగా ఉన్నారు. గతంలో 2014–18 మధ్య కాలంలోనూ టీడీపీ నాయకులు ఇదే వైఖరి అవలంబించారు. దీనిపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
పాల్గొన్న క్రీడా సంఘాల నాయకులు, క్రీడాభిమానులు, అధికారులు, పీడీలు, ప్లేయర్లు
ముఖం చాటేసిన పాలకపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు

రన్.. అదిరెన్