
దుకాణాలు సర్దేశారు..!
ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస బస్టాండ్ కు సమీపంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ఖాళీగా దర్శనమిస్తోంది. కొనుగోలుదారులు అంతగా రాకపోవటంతో రైతులు తమ దుకాణాలను పూర్తిగా ఖాళీ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా విక్రయించుకునేందుకు గతంలో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఆమదాలవలస రైతు బజారులో 48 దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఒకటి రెండు దుకాణాల్లో కిరాణా, బియ్యం వంటివి విక్రయించుకొని రైతులు తమ వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పట్టణానికి దూరంగా ఈ రైతు బజారును నిర్మించడం వల్ల కొనుగోలుదారులు అంత దూరం వెళ్లడానికి సుముఖత చూపడం లేదు.
మున్సిపాలిటీ పరిధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి అనేక దుకాణాలు నిర్మించి వ్యాపారులకు అద్దెలకు ఇవ్వటంతో వ్యాపారమంతా అక్కడే కొనసాగుతోంది. దీంతో విక్రయదారులు రైతు బజారుకు వచ్చే అవకాశం లేకపోవటంతో రైతులంతా ఒక్కసారిగా ఖాళీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు సంబంధించిన పంటలను కొనుగోలు చేసి ఉల్లి, టమాటా వంటి వస్తువులు రైతు బజార్ల ద్వారా రాయితీపై అందించాల్సి ఉంది. అసలు రైతు బజా రే లేకపోతే రాయితీపై సరుకులు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తుఫాన్, వరదలు వంటి సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు రైతు బజార్ల ద్వారానే ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఆమదాలవలసలో పూర్తిగా రైతు బజారే మూతపడే పరిస్థితి ఉంటే ప్రజలను కూటమి ప్రభుత్వం విపత్తుల సమయంలో ఎలా ఆదుకుంటుందో ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటిౖకైనా కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు రైతులకు ఎంతో మేలు కల్పించే ఈ రైతు బజార్ను తెరిపించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.