
గ్రామంలో ఒంటరి జీవితం
సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా విష్ణుచక్రం ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. కానీ ఆ వృద్ధ దంపతులు మాత్రం గ్రామాన్ని వదిలి వెళ్లలేదు. పగలు, రాత్రి బిక్కుబిక్కుమంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు తమ భూ ములతో పాటు గ్రామాన్ని కూడా పోర్టు నిర్మాణానికి త్యాగం చేశారు. నష్టపరిహారంతో పాటు నౌపడలోని 58 ఎకరాల్లో ఈ రెండు గ్రామాలకు పునరావాస కాలనీ గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అయితే మొదటి విడతగా విష్ణు చక్రం గ్రా మానికి చెందిన 57 మందికి లాటరీ ద్వారా పునరావాస కాలనీలో ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు. దీంతో విష్ణుచక్రం గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రా మంలో అందరూ ఖాళీ చేసినా గ్రామానికి చెందిన గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి అనే వృద్ధ దంపతులు మాత్రం ఊరిని విడిచి వెళ్లలేదు. పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, నౌపడలో పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వలేదని, కన్న ఊరును విడిచి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ పగలు, రాత్రి జీవనం సాగిస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వకపోతే తాము ఎక్కడికి వెళ్లినా ఎలా బతకగలమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో భయాందోళనతో బతుకుతున్నామని, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన దారపు కనకరత్నం కూడా పీడీఎఫ్ పరిహారం, పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.