విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం | - | Sakshi
Sakshi News home page

విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం

Jun 22 2025 3:12 AM | Updated on Jun 22 2025 3:12 AM

విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం

విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం

శ్రీకాకుళం న్యూకాలనీ:

పాఠశాల విద్యలో ప్రభుత్వ బడులను 9 రకాల స్కూళ్లగా విభజించి అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను కూటమి ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టింది. విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ పిల్లలకు ప్రాథమిక విద్యను ‘దూరం’ చేస్తోంది. ఒకప్పుడు సొంత ఊరిలోనే ఉండి చదువుకున్న పరిస్థితుల నుంచి.. నేడు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువు కొనాల్సిన దుస్థితి కల్పిస్తోంది. పునర్విభజన జరిగిన శ్రీకాకుళం జిల్లాలో తరగతుల విలీనమైన బడుల సంఖ్య 338 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 6,7,8 తరగతులు సమీపంలో విలీనమైన స్కూళ్లు 93 ఉండగా.., 3,4,5 తరగతుల విలీనం జరిగిన స్కూళ్లు ఏకంగా 245 ఉండటం గమనార్హం. ఒక్క పొందూరు మండలంలోనే సుమారు 12 ప్రాథమికోన్నత తరగతులను పొరుగున ఉన్న హైస్కూళ్లలో కలిపేశారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోను ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో తరగతులు విలీనం కావడంతో విద్యార్థులతో కలిపి తల్లిదండ్రులు బడుల వద్ద నిరసన చేస్తున్నారు. కొన్నిచోట్ల తాళం వేస్తున్నారు.

అలవెన్సులు ఇస్తారట..

ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య (6–14సంవత్సరాలు) అనేది రాజ్యాంగం బాలలకు ఇచ్చిన హక్కు. దానిని కూడా ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్సు పేరిట ప్రత్యమ్నాయ దిశగా హరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బాలల హక్కుల సంఘాలు, మహిళా శిశుసంక్షేమ శాఖ, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. తక్షణమే బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును కల్పించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. పాఠశాలల విలీనం తరువాత సింగిల్‌ టీచర్‌ స్కూళ్లే అధికమయ్యాయి తప్పిస్తే.. పిల్లలకు ఏవిధంగా మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఒకటి నుంచి పది తరగతులు నడపడానికి ప్రపంచంలో ఎక్కడా తొమ్మిది రకాల స్కూళ్లు లేవని.. ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి ఉందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ స్కూల్‌కు పంపించాలో..

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల స్కూళ్లతో తమ పిల్లలను ఏ స్కూల్‌కు తమ పిల్లలను పంపించాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు, శిక్షణా తరగతలు పూర్తిచేసుకుని.. ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయులు బడిబాట పడుతున్నారు. కొత్త పాఠశాలల్లో చేరిన టీచర్లకు సైతం స్థానిక పరిస్థితులు, స్థితిగతులు తెలియక అయోమయానికి గురవుతున్నారు.

ఇదీ పరిస్థితి..

శ్రీకాకుళం జిల్లాలో ఈ కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2955 పనిచేయనున్నాయి. గత విద్యా సంవత్సరం ప్రకారం 1,62,554 మంది చదువుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యపు విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించడానికి మొగ్గుచూపుతున్నట్టు ఉపాధ్యాయులే బాహాటంగా చెబుతున్నారు. 400 ప్రైవేటు పాఠశాలల్లో 95వేల మంది వరకు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల పేరిట ప్రభుత్వం నయవంచన

సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఆవేదన

కూటమి సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement