
ప్రయాణికుల కస్సు‘బస్సు’
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి జనాలను తరలించేందుకు జిల్లా నుంచి 220 బస్సులు వేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా రూట్లలో బస్సులు తిరగకపోవడంతో ముఖ్య ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో వింత పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్లో బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. ముఖ్యంగా విశాఖ వెళ్లే నాన్స్టాప్ కౌంటర్ ఖాళీగా కనిపించింది. మధ్యాహ్నం 12గంటల వరకూ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు రాక ఆ బస్సులు అలాగే ఉండిపోయాయి. ఇక ఇచ్ఛాపురం, పాతపట్నం, బత్తిలి, రాజాం, బొబ్బిలి, విజయనగరం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్టాప్ల వద్ద ప్రయాణికులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం కనిపించింది.
తప్పని పడిగాపులు..
శనివారం మధ్యామ్నం సమయంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండటం కనిపించింది. యోగాంధ్ర కార్యక్రమం పూర్తయి బస్సులు వచ్చేస్తాయని భావించి అనేక మంది ప్రయాణికులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకూ అధిక సంఖ్యలో ప్రయాణికులు కాంప్లెక్స్కు చేరుకున్నా బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు సైతం బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ముందస్తు సమాచారం లేకే..
విశాఖపట్టణంలో జరిగిన యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులను తరలించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిరగవని అధికారులు ముందస్తు సమాచారం చేరవేస్తే బాగుండేదని, తమ ప్రయాణాలను వాయిదా వేసుకునేవారమని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ఉదయం పూట బస్సులు ఉన్నా కానరాని ప్రయాణికులు
మధ్యాహ్నం పూట ప్రయాణికులు ఉన్నా లేని బస్సులు
ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపాటు

ప్రయాణికుల కస్సు‘బస్సు’