
మా పిల్లలను వేరే స్కూల్కు పంపించలేం
● వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన
గార : మా పిల్లలను కిలోమీటరు దూరంలో ఉన్న వేరే పాఠశాలకు పంపలేమంటూ గార మండలం వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాధవి, మాజీ చైర్మన్ రమణలు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులుండగా, ఆదర్శ పాఠశాల పేరు చెప్పి తండ్యాలపేట పాఠశాలకు 3, 4, 5వ తరగతుల విద్యార్థులను కలిపేందుకు నిర్ణయించారని, పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు ప్రతీ రోజు పుస్తకాల బరువుతో ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. దారిలో కుక్కల గుంపులు వంటి సమస్యలున్నాయని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ రోజువారీ వ్యవసాయం, కూలి పనులుకు వెళ్లకపోతే బతకలేని పరిస్థితి ఉందని, చిన్నారులను రోజు తీసుకువెళ్లి, తీసుకురావడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని కోరారు.

మా పిల్లలను వేరే స్కూల్కు పంపించలేం