
మేమేం చేయలేం!
జీడి పిక్కల
ధరలా..
పలాస: పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఉద్దానం ప్రజల జీవనాధారమైన జీడి రైతులు కూటమి సర్కారు తీరుతో ఉసూరుమన్నారు. జీడిపిక్కల కొనుగోలు, ధరల విషయమై జీడి రైతాంగ పోరాట కమిటీ నాయకులు గురువారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్దానం జీడి రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల విషయంపై జీడి రైతాంగ కమిటీ కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, రైతు నాయకులు అంబటి రామకృష్ణ, కోనేరు రమేష్, మడ్డు రాఘవరావు, అర్లి దానేసు తదితరులు ఎమ్మెల్యేకు వివరించారు. గత ఎన్నికల సమయంలో బస్తా జీడి పిక్కలను రూ.16వేలుకు కొనుగోలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బస్తా పిక్కలు ధర రూ.13,500 ఉందని చెప్పారు. అదే ధరకు రైతులంతా తప్పని పరిస్థితిలో జీడి పిక్కలను పలాస వ్యాపారులకు అమ్ముకున్నారని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో కూడా రూ.13,500 మాత్రమే ఉందని, పెరుగుతుందని ఆశించినా రైతులకు నిరాశ తప్పలేదన్నారు. జూన్లో పెరగడం పోయి ధరలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ప్రతినిధులు ఎంత వేడుకున్నా.. ఈ ధరలు తమ చేతుల్లో లేవని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఒక్క మాట చెప్పి చేతులెత్తేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైతాంగ ప్రతినిధులు నిరాశతో తిరిగి వచ్చేశారు.
సమావేశంలో చేతులెత్తేసిన పలాస ఎమ్మెల్యే శిరీష
నిరాశతో బయటకు వచ్చేసిన జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు
అధికార పార్టీ తీరుపై మండిపాటు
ఎమ్మెల్యే తీరుపై విమర్శలు..
జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేయాల్సిన సమయంలో పరిశ్రమలను ఎందుకు బంద్ చేశారని అటు జీడి కార్మికులతో పాటు జీడి రైతులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మార్కెట్లో జీడి పప్పు ధర ఏమాత్రం తగ్గడం లేదు. పలాస కాష్యూలేబర్ యూనియన్, పలాస కాష్యూ అసోసియేషన్ రెండు సంఘాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. గత 20 రోజులుగా జీడి కార్మికులకు ఉపాధిలేదు. ఉద్దానం ప్రాంతంలో జీడి పిక్కలు కొనడానికి జీడి వ్యాపారులు ముందుకు రావడం లేదు. వారు కొనుగోలు చేయలేకపోవడానికి వారి వద్ద తగిన డబ్బులు లేవని ఆ వ్యాపారస్తులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జీడి కార్మికులకు , అటు జీడి రైతులకు తగిన న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే శిరీష తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంపై రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ చట్టసభలు, వివిధ రూపాల్లో పోరాటాలు చేయాల్సింది పోయి ఈ విధంగా తాము ఏమీ చేయలేమని చెప్పడం సరికాదని చెబుతున్నారు.