
లాసెట్లో సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ లాసెట్–2025 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. జిల్లా నుంచి యూజీ, పీజీ మూడు విభాగాల్లో న్యాయ కోర్సులకు కలిపి మొత్తం 594 మంది పరీక్షలకు హాజరుకాగా గురువారం విడుదలైన ఫలితాల్లో 558 మంది ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత సాధించారు. మూడేళ్ల యూజీ న్యాయవిద్యకు జిల్లా నుంచి 551 మంది దరఖాస్తు చేసుకోగా 406 మంది పరీక్ష రాశారు. వీరిలో 394 మంది అర్హత సాదించారు. ఐదేళ్ల యూజీ న్యాయవిద్యకు 146 మంది దరఖాస్తు చేసుకోగా 117 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 111 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండేళ్ల పీజీ లాసెట్కు జిల్లా నుంచి 71 మంది దరఖాస్తు చేసుకోగా.. 53 మంది పరీక్ష రాశారు. వీరంతా అర్హత సాధించినట్టు లాసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. పీజీ రెండేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో నగరంలోని ఏపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.విజయమణికంఠ 107 మార్కులతో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. ప్రస్తుతం విశాఖపట్నం ఏయూ క్యాంపస్లో మూడేళ్ల యూజీ న్యాయ కోర్సులో చివరిదైన 6వ సెమిస్టర్ పరీక్షలు రాశాడు. మంచి యూనివర్సిటీలో పీజీ లా పూర్తిచేసి, న్యాయాధికారి పోటీపరీక్షలపై దృష్టిసారించినట్టు చెబుతున్నాడు.
కేతనకు 29వ ర్యాంకు
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన తమ్మినైన కేతన ఏపీ పీజీ లాసెట్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకును సాధించింది. 120 మార్కులకు గాను 100 మార్కులతో సత్తాచాటింది. ఈమె సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసింది. తండ్రి తమ్మినైన గోపాలరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా, తల్లి కమలకుమారి, గృహిణి.
6వ ర్యాంకుతో మెరిసిన విజయమణికంఠ
జిల్లా నుంచి 558 మంది అర్హత

లాసెట్లో సిక్కోలు హవా