
సమస్యలపై స్పందించాలి
అరసవల్లి: జిల్లాలో వివిధ శాఖాధికారులంతా సమస్యలపై తక్షణమే స్పందన చూపాలని, అలాగే ‘స్థానిక’ సంస్థల ప్రజాప్రతినిధుల సూచనలను ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే స్పందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. విద్యుత్ శాఖలో ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, సంబంధం లేని వ్యక్తుల ఫోన్ నంబర్లకు మీటర్లు కనెక్షన్లు ఉన్నట్లుగా చూపిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధికి దారుణమైన నిబంధనలు పెట్టారని, దీంతో పేద సామాన్య వర్గాలకు అవస్థలు తప్పడం లేదన్నారు. అధికారులు వీరి విషయంలో శ్రద్ధ వహించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే మంచినీటి పైపుల లీకులపై చాలావరకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించాలన్నారు. ఇదిలావుంటే జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలకు పలు ప్రభుత్వ శాఖల నుంచి సకాలంలో ప్రగతి నివేదికలు రావడం లేదని, అలాగే పలు శాఖాధికారులు హాజరుకావడం లేదని, వీరిపై చర్యలు చేపట్టేలా జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజాకు ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, విద్యుత్ శాఖ ఈఈ పైడి యోగేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ పి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 3, 5, 6వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ వైస్ చైర్మన్లు పాలిన శ్రావణి, సిరిపురపు జగన్మోహనరావు, వీరఘట్టం జెడ్పీటీసీ జంపు కన్నతల్లిల అధ్యక్షతన జరిగాయి. కార్యక్రమంలో సంబంధిత కమిటి సభ్యులుగా జెడ్పీటీసీలు పాల్గొన్నారు.