
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం రెండో డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో పి.గౌరి అనే ప్రయాణికురాలు గురువారం సాయంత్రం విజయనగరం నుంచి పూసపాటిరేగకు ప్రయాణం చేసింది. ఈ సమయంలో తన బ్యాగ్లో ఉన్న 6 తులాల బంగారం బాక్స్ను బస్సులో జారవిడుచుకుంది. విషయం గమనించక పూసపాటిరేగలో దిగిపోయింది. ఇంటికెళ్లి చూసేసరికి బాక్స్ లేకపోవడంతో ఆందోళనకు గురైంది. బస్సులో పడిపోయి ఉంటుందని భావించి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుంది. జరిగిన విషయాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎస్ఎం ఎం.పి.రావు దృష్టికి తీసుకువెళ్లింది. ఇంతలో కండక్టర్ వి.వి.ఆర్.మూర్తి, డ్రైవర్ రాంబాబులకు బాక్సు దొరకడంతో తీసుకొచ్చి అధికారులకు అందజేశారు. బాక్సులో బంగారు వస్తువులు గౌరివేనని గుర్తించి ఆధార్కార్డు ఆధారంగా అందజేశారు. కండక్టర్ వి.వి.ఆర్ మూర్తి, డ్రైవర్ రాంబాబుల నిజాయితీని అధికారులు అభినందించారు.
యోగాంధ్రకు ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నంలో ఈ నెల 21 జరిగే యోగాంధ్రకు భారీ ఎత్తున జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లే వాహన రాకపోకలకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం నుంచి వెళ్లే బస్సులు శ్రీకాకుళం, రణస్థలం, తగరపువలస, చిలకపేట మీదుగా భీమిలి బీచ్ రోడ్డు వద్దకు చేరుకోవాలి. వారికి నిర్దేశించిన పార్కింగ్ / డ్రాపింగ్ పాయింట్లలో మాత్రమే బస్సులు దిగి కేటాయించిన కంపార్ట్మెంట్లకు చేరుకోవాలి.