ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. జిల్లాలో మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం వరి 1.50లక్షల హెక్టార్లుగా లక్ష్యం నిర్ణయించారు. ఈ ఏడాది రైతులకు అందించే విత్తనాలు, ఎరువుల పంపిణీ విషయంలో సందిగ్ధత ఇంకా వీడలేదు. ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధత ఎలా ఉందో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.త్రినాథ స్వామి వివరించారు. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
– శ్రీకాకుళం పీఎన్ కాలనీ
సాక్షి: ఈ ఏడాది సాగు లక్ష్యం ఎంత..? విత్తనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జేడీ: ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగు లక్ష్యం 1.50లక్షల హెక్టార్లుగా నిర్ణయించాం. గత ఏడాది కంటే 6421 హెక్టార్లు పెంచాం. విత్తనాలు వరి 38,499 క్వింటాళ్లు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటివరకు ఏపీ సీడ్స్ ద్వారా దాదాపు 30వేలు క్వింటాళ్ల పైచిలుకు విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేశాం.
సాక్షి: అధిక దిగుబడులు రావాలంటే పాటించాల్సిన సూత్రాలు?
జేడీ: విత్తన ఎంపిక అనేది చాలా కీలకం. నాట్లు వేసే పద్ధతి అయితే అధిక దిగుబడులకు అవకాశం ఉంటుంది. వరిపూత దశకు వచ్చే సమయంలో కాలిబాటలు తీయాలి.
సాక్షి: రైతు సేవా కేంద్రాల పరిస్థితి ఏమిటి?
జేడీ: జిల్లాలో 838 రైతుసేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు వివరాలు నమోదు చేసుకుంటే అన్ని సేవలు ఈ కేంద్రాల నుంచే అందిస్తున్నాం. సేవలు అంతంతమాత్రమే అన్న ఆరోపణలు సరికాదు.
సాక్షి: ఈ ఏడాది తుఫాన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా..?
జేడీ: మన జిల్లాకు ఎప్పుడూ తుఫాను ముప్పు పొంచి ఉంటుంది. జూన్లోనే నాట్లు వేయ డం మొదలైతే ముందస్తుగా పంటకాలం పూర్తయ్యి తుఫాన్ల బారిన పడకుండా రైతులు గట్టెక్కవచ్చు. తుఫాన్లకు తట్టుకునే రకాల విత్తనాలు 1210–సుజాత, 1061 –ఇంద్ర, 1064–అమర, స్వర్ణ–7029, శ్రీదృతి–1121, సాంబ–5204, శ్రీకాకుళం సన్నాలు–2531లు వంటి విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
సాక్షి: ఎరువులు వాడకం తగ్గిందా. పెరిగిందా?
జేడీ: ఎరువుల వాడకం తగ్గిస్తేనే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. శక్తివంతమైన ఆహారం అందుతుంది. వ్యవసాయ పనులు సులువుగా చేసుకునేందుకు రైతులు ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నాణ్యమైన దిగుబడులు రాకపోగా చీడపీడలు అధికమవుతాయి. సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యతనివ్వాలి.
సాక్షి: వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల పరిస్థితి ఎలా ఉంది..?
జేడీ : ప్రజల ఆహార అలవాట్లు మారాయి. దాన్ని బట్టి వరికి ప్రత్యామ్నాయంగా రాగు లు, గంటెలు, సామలు, కొర్రలు, కందులు, మొక్కజొన్నలు వేసేలా ప్రోత్సహిస్తున్నాం. వరికి సుమారు 150రోజులు పంట కాలం ఉంటుంది. మిగిలిన పంటలకు 90నుంచి 120 రోజుల్లోపే మంచి దిగుబడులు వస్తాయి. లాభాలు ఎక్కువగా వస్తాయి.
సాక్షి: సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి ఉందా?
జేడీ: జిల్లాలో 35వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. కానీ వరుసగా మూడేళ్లు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే దా న్ని లెక్కలోకి తీసుకుంటాం. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.
సాక్షి: కౌలు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది?
జేడీ: భూ యజమానులతో పాటు సమానంగా కౌలు రైతులకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నాం. ఇప్పటికే 9800 మందికి సీసీఎల్ఏ కార్డులు అందించాం. ఉచిత పంటల భీమా కూడా వర్తించేలా చేస్తాం. కౌలు పత్రం ఉంటే ఈ–పంట నమోదు చేసుకుంటేనే పరిహారాలన్నీ అందుతాయి. భూయజమాని కౌలుదారుని అగ్రిమెంట్ రెన్యువల్ ఏటా చేయాలి.
సాక్షి: జిల్లాలో అగ్రిల్యాబ్ల పరిస్థితి
ఎలా ఉంది?
జేడీ: జిల్లాలో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్తో కలిపి మొత్తం 9 ఉన్నాయి. అందులో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అగ్రిల్యాబ్కి మిషనరీ రాలేదు. జిల్లా కేంద్రంలో ల్యాబ్ ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన 7 ల్యాబ్ల్లో విత్తనాలు, ఎరువుల నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాం.
వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాధస్వామి సాక్షితో ముఖాముఖి
ఈ యేడు సాగు విస్తీర్ణం పెంచినట్లు వెల్లడి
సేంద్రియ ఎరువులు వాడాలని సూచన
సాక్షి: యంత్రాల వాడకం ఎలా ఉంది?
జేడీ: సులువుగా వ్యవసాయం చేసుకునేందుకు కావాల్సిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. సీడ్డ్రిల్, దుక్కుదున్నే యంత్రాలు, నారు యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
సాక్షి: రైతులకు వ్యవసాయ రుణాలు
సకాలంలో అందిస్తున్నారా?
జేడీ: ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు త్వరలోనే పడతాయి. రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది తీసుకున్న రైతులకే కాకుండా మరో 10శాతం మంది రైతులకు అదనంగా రుణాలు మంజూరు చేస్తాం.
సాగు మీది.. సాయం మాది
సాగు మీది.. సాయం మాది
సాగు మీది.. సాయం మాది
సాగు మీది.. సాయం మాది