
రాత్రి 2గంటలకు జనాలను తరలించాలట..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమ జనసమీకరణ కోసం అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నయానోభయానో చేసి, సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని జనాలను తీసుకెళ్లారు. ఇప్పుడేమో విశాఖపట్నంలో ఈ నెల 21 జరిగే యోగా డే కోసం జన సమీకరణ చేసి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెప్పు కోసం రెండు కార్యక్రమాలకు జనా లు తరలించే బాధ్యతను అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించారు. ప్రభుత్వం కేటాయిస్తామనేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ కావడంతో అధికారులు నలిగిపోతున్నారు. దానికి తోడు యో గా డే కోసం ముందు రోజు రాత్రి 2 గంటలకు జనాలను తరలించే బాధ్యతను తీసుకోవాలని ఉన్నతా ధికారులు ఆదేశించారు. ఆ సమయంలో మహిళలను ఎలా తీసుకెళ్లాలో అని సచివాలయ ఉద్యోగు లు తలలు పట్టుకుంటున్నారు. బయలుదేరిన వాళ్లకు డబ్బుల సంగతి పక్కన పెట్టి, వారికి అవసరమైన స్నాక్స్ అందజేసే బాధ్యత తీసుకోవాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు అప్పగించారు. ముందు డబ్బులివ్వకుండా ఖర్చు పెడితే వెనక్కి వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు.
మొన్నటి స్నాక్స్ సొమ్మే రాలేదు...
మళ్లీనా?
అమరావతిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమం రోజున జిల్లా నుంచి పెద్ద ఎత్తున బస్సులు ద్వారా జనాలను తరలించారు. ఆ సమయంలో బస్సులు, భోజనాలు కోసం చేసిన ఖర్చు ప్రభు త్వం వెనక్కి ఇచ్చిందో లేదో తెలీదు గానీ వెళ్లిన వారికి అందజేసిన స్నాక్స్ ఖర్చు ఇంతవరకు ఇవ్వలేదు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులే స్నాక్స్ భారాన్ని మోశారు. ఒక్కొక్కరికీ రూ.వేలల్లో ఖర్చయ్యింది. ఆ సొమ్ము ఇంతవరకు జమ చేయలేదు. తాజాగా విశాఖలో జరిగే యోగా డే కోసం తరలించే వారికి కూడా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు(సూపర్వైజర్లు) స్నాక్స్ ఖర్చులు భరించాలని ఉన్నతాధికారులు సెలవిచ్చారు. దీంతో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులు బుధవారం జూమ్ మీటింగ్ పెట్టి స్నాక్స్ ఖర్చులు పెట్టుకోవా లని ఆదేశించారు. ఈ మీటింగ్లో కొంతమంది సూపర్వైజర్లు జోక్యం చేసుకుని అమరావతికి తరలించిన జనాలకు ఖర్చు పెట్టిన స్నాక్స్ సొమ్మే ఇంతవరకు రాలేదని, యోగా డేకు తరలించే జనాలకు ఎలా ఖర్చు పెట్టగలమని అడిగితే.. డబ్బులు సంగతి తర్వాత చూద్దాం, ముందు ఖర్చు పెట్టండని ప్రాజెక్టు అధికారి దాటవేయడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టు నుంచి 3వేల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టారు. ఈ లెక్కన ఒక్కో ప్రాజెక్టుకు స్నా క్స్ ఖర్చు రూ.80వేల వరకు, జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు రూ.11లక్షల వరకు ఖర్చవుతుంది. ఇదంతా సూపర్వైజర్లు భరించాల్సి ఉంటుంది.
యోగాంధ్ర కోసం అధికారుల పాట్లు
జనసమీకరణ చేసి తీసుకురావాల్సిందే అని ఉన్నతాధికారుల హుకుం
‘అమరావతి సభ’ ఖర్చులే నేటికీ రాని పరిస్థితి
యోగా డే కార్యక్రమానికి వెళ్లేవారికి స్నాక్స్ పెట్టాలంటూ ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఆదేశం
రాత్రి 2గంటలకు జనాలను
తరలించాలంటూ సచివాలయం ఉద్యోగులకు ఆదేశం
ఏం చేస్తారో తెలీదు గానీ జనాలను తీసుకురావల్సిందేనని హుకుం జారీ చేయడంలో అధికారుల దగ్గరి నుంచి సిబ్బంది వరకు తలలు పట్టుకుంటున్నారు. జన సమీకరణ చేయడమే కష్టమనుకుంటే రాత్రి 2గంటలకు బయలుదేరించి, బస్సుల ద్వారా తీసుకురావాలని సచివాలయ ఉద్యోగులకు బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో జనాలను బయలుదేరించడమంటే కష్టమేనని ఉద్యోగులు అంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు కావడంతో కక్కలేక, మింగలేక సచివాలయ ఉద్యోగులు సతమతమవుతున్నారు. వాస్తవంగా, ప్రభుత్వం చేప ట్టే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమాల పేరుతో జనాలు తరలించడం, వారికయ్యే ఖర్చులు భరించడం తలకుమించిన భారమే కాదు కత్తిమీద సాములా తయారైంది.

రాత్రి 2గంటలకు జనాలను తరలించాలట..