ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:30 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక సమగ్ర రక్షిత నీటి సరఫరా స్కీమ్‌(సీపీడబ్ల్యూఎస్‌) నిర్మించలేదు. పబ్లిసిటీతో కాలం గడిపేసి ఉన్న స్కీమ్‌లను ధ్వంసం చేసే పరిస్థితులను తీసుకొస్తోంది. తమ నేతల జేబులు నింపడానికి ఉన్న వనరు లను అర్పించేస్తోంది. నీటి వనరులు పోతే ఏంటి? గ్యాస్‌ పైపులైన్‌కు ముప్పు వాటిల్లితే మాకేంటి? కాలువ గట్లు ఛిద్రమైతే నష్టమేంటి? అని ప్రభుత్వ మే విధ్వంసానికి సహకరిస్తోంది. నైర దగ్గర వంశధారలో జరుగుతున్న అడ్డగోలు కార్యకలాపాలతో భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉన్నట్టే కనబడుతోంది.

దోపిడీకి బాటలు..

జిల్లాలో ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు. నదీ తీర ప్రాంతం లేని నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇసుకను దోచేస్తున్నారు. అడ్డగోలుగా తవ్వకాలు జరిపి, అక్రమంగా తరలించి రూ.వేల కోట్లు వెనకేసుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో ఒక్కో నాయకుడు రూ. కోట్లలో సంపాదించుకున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా, రక్షిత మంచినీటి పథకాలు, వంతెనలు, కరకట్టలు అని చూడకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రోడ్లు ఛిద్రమవుతున్నా, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా లెక్క చేయకుండా భారీ ట్రక్కుల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. యంత్రాంగం జారీ చేసే బిల్లులను పోలిన బిల్లులను నకిలీ డివైజ్‌లతో సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. నదీ తీర ప్రాంతాలను ఇసుక తవ్వకాలతో ధ్వంసం చేస్తున్నారు. లోతైన గోతులతో ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వర్షాలు పడి వరదలు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తవ్వకాలు చేయగా, తాజాగా నైరపై పడ్డారు. నైరలోని వంశధార నదిలో అనుమతి లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. కానీ, అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

వంశధార నదిలో ఇసుక అక్రమాల కోసం అడ్డంగా వేసిన రోడ్డిది. అనుమతుల్లేకుండా రోడ్డు వేశారు. ఆ రోడ్డుకు దగ్గరలో రక్షిత మంచినీటి పథకం, గెయిల్‌ గ్యాస్‌ పైపు లైన్‌ ఉంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టి, రవాణా చేస్తే ముప్పు తప్పదు. ఇక్కడే బైరిదేసి గెడ్డ కాలువ గట్టును కూడా ధ్వంసం చేసి, ఇసుక లారీల రవాణా కోసం తాత్కాలిక రోడ్డు నిర్మించారు. వాస్తవానికి 40టన్నుల సామర్థ్యం గల లారీల రవాణాకు కాలువ గట్టులు పనికి రావు. కానీ, అధికారులు చోద్యం చూస్తున్నారు.

తాగునీటి ప్రాజెక్టు, గెయిల్‌ గ్యాస్‌ పైపు లైన్‌, బైరిదేసి గెడ్డ గట్టు తదితర వాటికి ఇసుక అక్రమార్కులు తలపెడుతున్న హానిని ముందే గుర్తించిన శ్రీకాకుళం రూరల్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు అప్రమత్తమై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని, ఇస్తే వనరులు ధ్వంసమవుతాయని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీపీ ప్రతినిధి అంబటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ప్రతినిధి ఎచ్చెర్ల శ్రీధర్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ మూకాళ్ల తాతబాబు, వైస్సార్‌సీపీ గ్రీవెన్స్‌ విభాగం జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, సానివాడ ఎంపీటీసీ రుప్ప అప్పలసూరి, శ్రీకాకుళం అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షులు గొండు హరీష్‌, ఊటపల్లి కృష్ణారావు, శిమ్మ భగవాన్‌ దాస్‌ తదితర నాయకులతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు 1
1/3

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు 2
2/3

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు 3
3/3

ముప్పును గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement