
రిక్వెస్ట్ బదిలీలకు ఛాన్స్..!
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖకు అనుబంధమైన సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్వెస్ట్ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు లేకుండా రిక్వెస్ట్ బదిలీలకు సంబంధించి అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ప్రకారం ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కార్యాలయం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు మెయిల్ ద్వారా కేజీబీవీలకు చేరవేయడం జరిగిందని, అలాగే ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లో సైతం అందుబాటులో ఉంచారని, అదేవిధంగా శ్రీకాకుళం డీఈవో అధికారిక వెబ్సైట్ డీఈవోఎస్కేఎల్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
గతంలో పారదర్శకం
జిల్లాలో సమగ్ర శిక్ష పరిధిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 1,210 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో ఖాళీలు ఉన్న చోటుకు, ఉద్యోగులు పరస్పర (మ్యూచువల్) అంగీకార పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు స్టేట్ ఎస్పీడీ అవకాశం కల్పించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్దేశిత సీనియారిటీ ప్రకారం కోరుకున్న చోటుకు 2020, 2023లో అత్యంత పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జేబులు చింపేందుకు, ఉద్యోగులతో అనేక రకాలుగా పైరవీలు చేసుకునేందుకు రిక్వెస్ట్ బదిలీలకు తెరితీసినట్టుగా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పది కేటగిరిల్లో దరఖాస్తులు
పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో 10 కేటగిరిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుకానున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్, ఇన్క్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీస్), పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు (పీటీఐలు), క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ (సీఆర్ఎంటీలు), మండల్ స్థాయి అకౌంటెంట్లు, సైట్ ఇంజినీర్లు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, కార్యాలయ సబార్డినేటర్లు పోస్టులకు రిక్వెస్ట్ ప్రాతిపదికపై బదిలీలు జరపనున్నారు.
అవకాశం కల్పించిన రాష్ట్ర సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు
నేటి నుంచి దరఖాస్తులకు అవకాశం
సద్వినియోగం చేసుకోవాలి
సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హ్యూమానిటీస్ గ్రౌండ్లో రిక్వెస్ట్ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఖాళీలు ఉన్నచోట, మ్యూచువల్ అంగీకార పద్ధతిలో స్థాన చలనం జరిపించేలా రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. జిల్లాలో సమగ్రశిక్షా పరిధిలో పనిచేస్తున్న 10 కేటగిరి ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 21లోగా దరఖాస్తులు నేరుగా జిల్లా ఏపీసీ కార్యాలయంలో సమర్పించాలి. – డాక్టర్ సంపతిరావు శశిభూషన్,
సమగ్రశిక్షా జిల్లా ఏపీసీ, శ్రీకాకుళం

రిక్వెస్ట్ బదిలీలకు ఛాన్స్..!