
ప్రతినెలా 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీపీటీడీ ఆర్టీసీ నందు శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు డిపోల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా 10వ తేదీలోపు జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికశాఖ అధికారికి ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోల్లో దాదాపుగా 220 మంది కార్మికులు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారన్నారు. వీరికి ఆర్టీసీ యాజమాన్యం ద్వారా వచ్చే వేతనాలను కాంట్రాక్టర్లు ద్వారా చెల్లిస్తున్నారని. కాంట్రాక్టర్లు తీసుకునే సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ కాకుండా, అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలు వరకూ కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్లు కార్మికుల కష్టాన్ని దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సమస్యను గతంలో పలుమార్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్కుమార్, లేబర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
ఆదేశాలు పట్టించుకోవడం లేదు
జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్కుమార్ ఫిబ్రవరిలో కాంట్రాక్టర్లు, కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చినా కాంట్రాక్టర్లు అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘం తరపున 23వ తేదీ సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన, నిరసన కార్యక్రమాలు, ధర్నాలను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్కు, అకౌంట్స్ ఆఫీసర్ సీహెచ్ రాజు, శ్రీకాకుళం 1 డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు, శ్రీకాకుళం 2 డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మ, టెక్కలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ ఆర్.ఎస్.నాయుడు తదితరులకు తెలియజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి కిరణ్, జిల్లా ట్రెజరర్ ఆర్.నవీన్కుమార్, ఏపీపీటీడీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.