
విద్యార్థుల భవిష్యత్ ఏమవ్వాలి..?
● రవీంద్రభారతి యాజమాన్యాన్ని నిలదీసిన తల్లిదండ్రులు
టెక్కలి: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తే పిల్లల భవిష్యత్ ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు రవీంద్రభారతి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఇటీవల రవీంద్రభారతి పాఠశాలను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ స్థానికంగా ఉన్నటువంటి మరో ప్రైవేటు పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులంతా ఆ పాఠశాల వద్దకు వెళ్లి రవీంద్రభారతి పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు సిబ్బందిని గట్టిగా నిలదీశారు. నిన్నటివరకు ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను ఎలా నిర్వహించారని, ఇప్పుడు మరో పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. దీంతో కొంత సమయం గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. పాఠశాలను మూసివేయడం, నిన్నటి వరకు మరలా పాఠశాలను తెరుస్తామని తల్లిదండ్రులకు బుజ్జగించడం, ఇప్పుడు మరో పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామని చెప్పడంతో రవీంద్రభారతి పాఠశాలలో చదివిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. చివరగా విద్యార్థులకు సంబంధించిన టీసీలు ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు.