
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కేటీరోడ్డులో విద్యుత్ కార్యాలయం ఎదురుగా బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీతో అతివేగంగా వచ్చిన స్థానిక యువకుడు రోడ్డుపక్కన పనసతొనలు అమ్ముకుంటున్న కంచిలి మండలం కంచిలి గ్రామానికి చెందిన సిమ్మ ఆదమ్మను ఢీకొనడంతో తలకు వెనుకభాగంలో తీవ్రగాయమై రక్తస్రావమైంది. స్థానికులు యువకుడు, అతని వాహనాన్ని పట్టుకుని కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. మహిళను పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు అత్యవసర వైద్య సేవలు అందించారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో మితిమీరిన వేగంతో యువకులు ప్రయాణించడం, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, కాలం చెల్లిన వాహనాలతో ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.