
రొంపివలస విద్యార్థికి గోల్డ్ మెడల్
పాతపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో టాటా కంపెనీ(టీసీఎల్) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్లాస్టిక్ పొల్యూషన్ రెమెడీస్ బ్యూడింగ్ మోడ్రన్ ఇండియా వ్యాస రచన పోటీల్లో పాతపట్నం మండలంలోని రొంపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని లూకలాపు చాందిని జాతీయ స్థాయిలో మొదటి స్థానం కై వసం చేసుకుంది. దీంతో ఈనెల 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చాందినికి గోల్డ్ మోడల్, ప్రశంసా పత్రం, ధ్రువీకరణ పత్రం, రూ.35 వేల విలువ గల బహుమతిని అందజేశారు.
అనంతరం ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ము అభినందించారు. అలాగే ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్ తిరుమలరావు, హెచ్ఎం ఎన్.కుమారస్వామి, ఉపాధ్యాయులు అభినందించారు.