
నిచ్చెన వేసి..చోరీ చేసి!
సోంపేట: పలాసపురంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సోంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాసపురం గ్రామానికి చెందిన బెందాళం అశోక్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. రెండున్నర తులాల బంగారం, ఎల్ఐసీ కలెక్షన్ నగదు లక్ష రూపాయలు బీరువాలో ఉంచారు. సోమవారం రాత్రి ఎప్పట్లాగే కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి వేరే గదిలో ఉన్న బీరువా పగలగొట్టి ఉండటం గమనించారు. అందులో బంగారం, నగదు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి బయట నిచ్చెన ఉండటంతో దాని ద్వారా దొంగలు లోపలికి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోంపేట ఎస్ఐ లోవరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

నిచ్చెన వేసి..చోరీ చేసి!