
రెండు ఇళ్లలో చోరీ
నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని సౌభాగ్యలక్ష్మి కల్యాణ మండపం వెనుక సాయినగర్లో ఉన్న రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. విశ్రాంత ఉపాధ్యాయుడు దుంగ రామారావుతో పాటు గనగళ్ల రాంబాబుకు చెందిన ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ రెండు ఇళ్లకు చెందినవారు విశాఖలో ఉంటున్నారు. డోర్లాక్ చేసిన విషయాన్ని గమనించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగి రెండు మూడు రోజులు అయినట్లుగా తెలుస్తోంది. సోమ వారం ఉదయం స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ దుర్గాప్రసాద్ పరిశీలించి ఇంటి యజమానులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఈ చోరీలో తమ ఇంట్లోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 44 తులాల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు అపహరణకు గురైందని దుంగ రామారావు తెలిపారు. అలాగే కేజీన్నర వెండి వస్తువులు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గనగళ్ల రాంబాబు తెలిపారు. ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. చోరీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
● బంగారు, వెండి ఆభరణాల అపహరణ