
రాష్ట్ర ప్రజలను మోసం చేశారు
● వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కంటే మిన్నగా అన్ని రకాల పథకాలు ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు, అధికారం చేతికొచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. కూటమి పాలన వైఫల్యాలపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండడం దారుణమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పాలన అందించారన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం తెలుగు తమ్ముళ్లు, పెత్తందారుల అభివృద్ధే ముఖ్యమన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనా నేటికీ అన్నదాత సుఖీభవ డబ్బులు వేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా విత్తనాలు పంపిణీ చేయకపోవడం అన్యాయమన్నారు. కూటమి పాలనలో అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో సమాధానం చెప్తారని పేర్కొన్నారు.