
అక్రమ అరెస్టులతో సంక్షేమానికి తూట్లు
కంచిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి అక్రమ అరెస్టులతో ప్రజానీకం దృష్టి మరల్చుతున్నారని జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా తల్లికి వందనం పథకంలో ప్రతి తల్లికి రూ.2వేలు కోతపెట్టి రూ.13వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేయడం తగదన్నారు. పూర్తిగా రూ.15వేలు ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజానీకం దృష్టి మరల్చడానికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయించారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం చూస్తే కూటమి ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరుగుతుందో ప్రజలకు అర్ధం అవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టులపై కేసులు పెట్టడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు.