
పోషకాల రేడు.. నేరేడు
● కిలో నేరేడు రూ.200 వరకు విక్రయం
● మితంగా తీసుకోవాలంటున్న వైద్యులు
పాతపట్నం: నేరేడు మార్కెట్లో మిలమిలలాడుతూ ఆకర్షిస్తోంది. నేరేడు పండుతో పాటు ఆకులు, చెట్టు, బెరడు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. నేరేడు పండ్లను కోయడం కొంత కష్టంతో కూడుకున్న పని అందువల్లే ధర కూడా అధికంగానే ఉంటుంది. రైతు నుంచి దళారులు కిలో రూ.80కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దళారులు వ్యాపారులకు రూ.130 కు విక్రయిస్తున్నారు. వ్యాపారులు వినియోగదారులకు రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నేరేడు పండ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. నేరేడు పండ్లను ఇక్కడి వ్యాపారులు ఒడిశా (గుణుపూర్) నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు
● నేరేడు పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారీ నుంచి రక్షణ కులుగుతుంది.
● మూత్ర సమస్యల నియంత్రణతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
● మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయం పనితీరు మెరుగుపరచడంతో పాటు శుభ్రపరుస్తుంది.
● నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
● దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోటిలో చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది.
ఇమ్యునిటీ పెరుగుతుంది
నేరేడు పండ్లులో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు విటమిన్లు ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచింది. శరీరంలో చిగుళ్లు బాగుంటాయి, ఔషధ లక్షణాలు మెండుగా ఉన్నాయి.
– డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్సీ, సూపరింటెండెంట్, పాతపట్నం