
ఉద్దానంలో ‘జీడి బోర్డు’ ఏర్పాటు చేయాలి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన రైతులు జీవనాధారమైన జీడి పంటకు మద్దతు ధర కల్పించి స్థానికంగా జీడి బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాతుపురంలో శుక్రవారం రైతు సంఘ నాయకులు, ఉద్దాన రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహన్రావు, జీడి రైతు సంఘ జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను విస్మరించి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటన్నారు. జీడి పప్పు ధరలు మార్కెట్లో బాగానే ఉన్నప్పటికీ జీడి వ్యాపారులు దురాశతో జీడి పరిశ్రమలకు లాకౌట్ ప్రకటించడం దారుణమని అన్నారు. జీడి రైతులను ఆందోళనకు గురి చేసి వారి నుంచి కారుచౌకగా జీడి పిక్కలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో పలు మార్లు జీడి మద్దతు ధర అంశంపై లేవనెత్తినప్పుడు సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎలాంటి సమాధానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘ నాయకులు కె.రమేష్,ఎం.కామేశ్వరరావు,మడ్డు రాఘవరావు,అర్లి దానేస్, ఉప్పరపల్లి ఢిల్లీరావు, రెయ్యి మంజు, దాసరి మోహన్రావు, సీహెచ్ భాస్కరరావు, చిరంజీవి తదితరులు ఉన్నారు.