
‘విద్రోహ చర్యపై నిజాలు నిగ్గు తేల్చాలి’
హిరమండలం: కూర్మ వైదిక గ్రామంలో ఇస్కాన్ ఆశ్రమం అగ్నిప్రమాదంలో దగ్ధమైన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రమాదంలో ప్రధాన ఆశ్రమం కాలిబూడిదైంది. 2018లో ఇక్కడ వైదిక గ్రామం ఏర్పాటైంది. విద్యుత్ వంటి ఆధునిక సదుపాయాలకు దూరంగా.. సనాతన ధర్మంతో పాటు ప్రాచీన సాగు విధానంతో ఇక్కడ కూర్మ గ్రా మం గత ఏడేళ్లుగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఇక్కడ అగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఆశ్రమం దహనం కావడం సంచలనంగా మారింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూర్మ ఆధ్యాత్మిక గ్రామాన్ని పరిరక్షించాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో గురువారం అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కొత్తూరు సీఐ ప్రసాద్, హిరమండలం ఎస్ఐ మహ్మద్ యాసిన్ పరిశీలించారు. విశ్వహిందూ పరిషత్తో పాటు ధార్మిక సంఘాల ప్రతినిధు లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలను బయటకు వెలికితీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.