
కొమనాపల్లి ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణ
జలుమూరు: కొమనాపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కనుసు ఉమారావుపై పూర్తి విచారణ చేసి డ్వామా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నామని నరసన్నపేట క్లస్టర్ ఏపీడీ కె.లోకేశ్ తెలిపారు. గురువారం కొమనాపల్లి సచివాలయంలో వేతనదారులతో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులు కనుసు రవి, గొల్లంగి సోమేశ్వరి, ఉమా, వాన శాంతమ్మ, పల్లి రమణమ్మ తదితరులను విచారించారు. ఫిర్యాదు చేసిన అంశాలలో ఎంత వాస్తవమో, రికార్డుల ప్రకా రం ఉన్న వాటిని సరిచూస్తామన్నారు. విచారణ బహిరంగంగా నిర్వహిస్తామని నోటీసు ఇచ్చి రహస్యంగా నిర్వహించడంపై సర్పంచ్ కనుసు సీతమ్మ, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కనుసు సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ఫీల్డ్ అసిస్టెంట్ తప్పు చేస్తే అందరి సమక్షంలో విచారణ చేసి చేసిన తప్పులు రుజువైతే చర్యలు తీసుకోవాలే గానీ వారికి అనుకూలంగా ఉన్న వారితో ఉపాధి పనులలో తప్పులు చేసినట్లు చెప్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. క్లస్టర్ ఏపీడీ లోకేశ్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇలా రహస్య విచారణ చేస్తున్నామని తెలిపారు.