
4 నెలల్లో 505 ఫోన్లు రికవరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో గడిచిన నాలుగు నెలల్లో బాధితులు పోగొట్టుకున్న రూ. 80 లక్షల విలువ చేసే 505 మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందజేస్తున్నామని, మరో 300 నుంచి 400 వరకు కనిపెట్టేందుకు సైబర్ సెల్ బృందం కృషి చేస్తోందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. పోగొట్టుకున్న మొబైళ్లను పొందేందుకు బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్లో సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టరై ఫిర్యాదు చేయడమేనన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టరవ్వాలి..
ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ముందుగా సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్, హెచ్టీటీపీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఇఐఆర్.జిఒవి.ఐఎన్ అనే పబ్లిక్ వెబ్సైట్లో బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఫిర్యాదు ఆధారంగా మొబైల్ ఐఎంఈ నంబర్లు బ్లాక్ అయ్యాక ఆ రిక్వెస్ట్ను సైబర్సెల్ పోలీసులు రిసీవ్ చేసుకుని మొబైల్ను ట్రాక్ చేస్తారన్నారు. రికవరీ అయ్యాక మొబైల్ను అన్బ్లాక్ చేసి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేస్తున్నామన్నారు. ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లోనే సెక్యూరిటీ లాక్ వేసుకోవాలన్నారు.
ప్రతిభకు ప్రశంసలు..
దూర ప్రాంతాలకు తరలిపోయిన ఫోన్లతో పాటు, అతి విలువైన మొబైళ్లను అతి తక్కువ కాలంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పర్యవేక్షణలో ఛేదించిన సైబర్, ఐటీ కోర్ సెల్ సీఐ టి.శ్రీను, సైబర్ నిపుణులు పైలా ఛక్రధర్ (ఛక్రి), గిరి, సుధీర్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.