రాప్తాడురూరల్: దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రమేష్ (49) జీవితం రోడ్డు ప్రమాదంలో విషాదంగా ముగిసింది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదం కూలీల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన కూలీలు రోజులాగే పని కోసం అనంతపురం శివారు ప్రాంతానికి ఆటోలో బయల్దేరారు. రామినేపల్లి దాటి కాస్తా దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో ఆటో అదుపుతప్పి కిందపడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురయ్యారు. వారిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటోను స్టేషన్కు తరలించారు.


