బాలయ్య ఇలాకాలో..
చిలమత్తూరు: సీఎం చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఓ అర్చకుడు తీసుకున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. ‘పరిశ్రమలు వస్తున్నాయని ఎమ్మెల్యే బాలకృష్ణ చెబితే భూములిచ్చాం. పరిహారం డబ్బు కోసం సంతకాలూ చేశాను. లిస్ట్లో నా పేరు కూడా వచ్చింది. ఆరు నెలలు గడుస్తున్నా డబ్బు మాత్రం ఇవ్వలేదు. టీడీపీ నాయకులకు చెప్పుకుంటే సెటిల్మెంట్ చేద్దాం అంటున్నారు’ అని బాధిత పురోహితుడు వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. వివరాలు.. టేకులోడు పంచాయతీ ఆరుమాకులపల్లికి చెందిన పురోహితుడు హర్షవర్దన్రావు టీడీపీ సానుభూతిపరుడు. ఇతని పొలాన్ని టేకులోడు సెజ్ కోసమంటూ చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. అయితే, ఇప్పటికీ పరిహారం మాత్రం అందలేదు. అధికారులు, టీడీపీ నాయకులను కలిస్తే సెటిల్మెంట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కడుపు మండిన హర్షవర్దన్ రావు ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ను ఉద్దేశిస్తూ తన ఆవేదనను వీడియో రికార్డు చేసి సోషల్మీడియాలో పోస్టు చేశాడు. హర్షవర్దన్ రావు టీడీపీ సానుభూతిపరుడు కావడంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టేకులోడు సెజ్కు సంబంధించి పరిహారం విడుదలైనప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయి. ఎమ్మెల్యే కార్యాలయం వేదికగా భారీగా సెటిల్ మెంట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా వీడియో ద్వారా అసలు కథ బయటపడింది.
పరిహారం ఇవ్వమంటే
సెటిల్ చేసుకో అంటున్నారని ఆవేదన
సోషల్మీడియాలో వీడియో వైరల్


