
సమష్టి కృషితో నేర నియంత్రణ
● సాంకేతిక పరిజ్ఞానంతో
దర్యాప్తు వేగవంతం
● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: సమష్టి కృషితోనే నేర నియంత్రణ సాధ్యమని, అందువల్ల కేసుల దర్యాప్తులో అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత ఆరు నెలల్లో వివిధ కేసుల్లో పురోగతి సాధించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందని, అందరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. చోరీల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి పూట గస్తీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు తీసుకోవాలన్నారు. వాటిని నేర రికార్డులతో సరిపోల్చి నేరగాళ్లను పట్టుకోవాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణ, కేవీ మహేష్, నరసింగప్ప, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సెలవులో రామగిరి సీఐ ●
● రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
చెన్నేకొత్తపల్లి: రామగిరి సీఐ శ్రీధర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ నంబర్ను కూడా ఆయన శుక్రవారం స్టేషన్లోనే సరెండర్ చేశారు. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని, తిరిగి ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తించడం అనుమానమేనన్న చర్చ జరుగుతోంది.
పది నెలలు కూడా కాకుండానే...
రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీధర్ పదినెలల కిందటే విధుల్లో చేరారు. సర్కిల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉండటంతో నిరంతరం ఒత్తిళ్లలోనే విధులు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. ప్రతి కేసులోనూ టీడీపీ నేతలు కలుగజేసుకోవడం...టీడీపీ ముఖ్యనాయకులు ఆదేశాలు జారీ చేయడంతో విసిగిపోయి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.
● రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన కురబ లింగమయ్య హత్య.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాఫ్టర్లో రాగా, హెలీప్యాడ్ వద్దకు భారీగా జనం వచ్చి హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడం. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఆయా ఘటనలకు సంబంధించి సీఐ శ్రీధర్పై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ తరచూ సెలవులో వెళ్తుండటంతో ఆయా కేసుల దర్యాప్తు చాలా నిదానంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీధర్ ఆందోళన చెందారని, మరోవైపు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తట్టుకోలేక సీఐ సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.