
ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయ సహాయం
హిందూపురం: వివిధ కేసుల్లో రిమాండ్లో ఉంటున్న వారిలో ఆర్థిక స్థోమత లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శనివారం హిందూపురం సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఏ కేసులో ఎంత కాలంగా రిమాండ్లో ఉంటున్నారని ఆరా తీశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోగలరా.. సబ్జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బెయిల్ కోసం న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత లేని వారికి అర్హత ఉంటే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. జైళ్లకు రావడం వల్ల స్వేచ్ఛ, శాంతి కోల్పోతారని, కుటుంబాల గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. కనీసం జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. రిమాండ్ ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే రాత పూర్వకంగా రాసి జైలు ఆవరణలోని ఫిర్యాదుల పెట్టెలో వేయాలన్నారు. అనంతరం జైలు గదులు, వంటగది పరిశీలించి ఆహార పదార్థాల తయారీ కోసం ఉపయోగించే సరుకుల గురించి సబ్జైలర్ హనుమప్పను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వన్నూరప్ప, న్యాయవాదులు శివశంకర్, సుధాకర్, సందీప్, లోక్ అదాలత్ సభ్యులు హేమావతి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో శిక్షణకు
వజ్రకరూరు సర్పంచ్
వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.
పశువులను తప్పించబోయి
ఢీకొన్న కార్లు
పెనుకొండ: పశువులను తప్పించే క్రమంలో రెండు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం శనివారం కారులో హైదరాబాద్ వెళుతుండగా.. పెనుకొండ సమీపంలోని పులేకమ్మ ఆలయం వద్ద పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ స్లో చేశాడు. ఆ సమయంలో ఈ కారును వెనక వేగంగా వచ్చిన మరో కారు ఢీకొంది. ఈ హఠాత్పరిణామంతో కార్లలో ప్రయాణిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పడమే కాకుండా కారును రోడ్డు పక్కన నిలిపి.. వారిని మరో వాహనంలో పంపించారు.
ఫేక్ కాల్తో నగదు మాయం
రొద్దం: సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతూనే ఉన్నారు. బ్యాంకు అధికారుల పేరిట బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు. రొద్దం మండలం గౌరాజుపల్లికి చెందిన ఓ యువతికి శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుని ఆధార్ అడిగాడు. ఆ యువతి ఆధార్ నంబర్ చెప్పి ఫోన్ పెట్టేయగానే తన బ్యాంకు ఖాతాలోని రూ.1000 నగదు డ్రా అయిపోయింది. తాను మోసపోయానని ఆ యువతి లబోదిబోమంటోంది.

ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయ సహాయం