
ఉచిత వైద్యం.. సత్యసాయి లక్ష్యం
ప్రశాంతి నిలయం: నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం అందించడమే సత్యసాయి లక్ష్యమని, సత్యసాయి వైద్య సంస్థలు ఈ మేరకు పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైట్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్.సుందరేశ్ దబిర్ అన్నారు. శనివారం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, వైద్య సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి ‘ఆదర్శ వైద్యం’ అన్న అంశంపై ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుందరేశ్ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సత్యసాయి బాబా 1956లో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్ ఆస్పత్రి ప్రారంభించారని, ఆ తరువాత బెంగళూరులో జనరల్ ఆస్పత్రి, ప్రశాంతి గ్రాం, వైట్ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన సేవగా మారిందని, కానీ సత్యసాయి సంస్థలు మాత్రం నేటికీ ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. ఇక్కడి సిబ్బంది సైతం రోగులను ప్రేమతో కూడిన వైద్యం సేవలు అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారన్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏటా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలను సత్యసాయి వైద్య సంస్థల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పని చేస్తోందన్నారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టోక్యో, యూనివర్సిటీ ఆఫ్ చికాగో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేసుకున్న రెండు ఒప్పంద పత్రాలను సత్యసాయి మహాసమాధి చెంత ప్రదర్శించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వైద్య సిబ్బంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ మెడికల్ సదస్సులో డాక్టర్ సుందరేశ్ దబిర్

ఉచిత వైద్యం.. సత్యసాయి లక్ష్యం