
పంచాయతీ కార్యదర్శుల నిరసన
ప్రశాంతి నిలయం: పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్లో ఫీడ్బ్యాంక్ ఆధారంగా పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిర్ణయించడం బాధాకరమన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కువ మజరా గ్రామాలు ఉండడం వల్ల ట్రైసైకిల్స్ ద్వారా ప్రతి గ్రామానికీ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందన్నారు. ,ప్రతి గ్రామానికీ ఒక క్లాప్ మిత్రను నియమించి ఇళ్లను బట్టి వారి వేతనాన్ని ప్రభుత్వమే నిర్ణయించి చెల్లించాలని కోరారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లను శానిటేషన్, పీడబ్ల్యూఎస్ స్కీంలలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, సచివాలయాల్లో రేషనలైజేషన్లో భాగంగా మిగులు ఉద్యోగులను పంచాయతీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించేందుకు పూర్తి అజమాయిషీ లేకపోవడం వల్ల ఇబ్బదులు పడుతున్నామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్లో డీఆర్ఓను కలసి అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలి
హిందూపురం టౌన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీలను అప్గ్రేడ్ చేయడంతో పాటు సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థి బలవన్మరణం
బత్తలపల్లి: డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామాపురం గ్రామానికి చెందిన కప్పల ఆదినారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు కప్పల నారాయణస్వామి (22) అలియాస్ బిందు డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు.

పంచాయతీ కార్యదర్శుల నిరసన