
అర్ధంతరంగా ఆగిన బదిలీలు
అనంతపురం సిటీ: తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆందోళనకు దిగడంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీ అర్ధంతరంగా ఆగింది. అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.జహీర్ అస్లాం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పీఆర్ హెడ్ మురళీమోహన్, ఈఈ ప్రభాకర్రెడ్డి, డీఈఈలు కె.లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్, డీఎల్ మురళి, జింకల కృష్ణజ్యోతి, సూపరింటెండెంట్లు ఖాజీ మొహిద్దీన్, రమాదేవి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ సజావుగా సాగింది.
సాయంత్రం ఆగిన కౌన్సెలింగ్..
సాయంత్రం 5.50 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఆ తరువాత అర్ధంతరంగా ఆగిపోయింది. కౌన్సెలింగ్లో కొందరు సచివాలయ ఉద్యోగులు పెళ్లి కాకపోయినా.. తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సృష్టించి సమర్పించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వాటి సంగతి తేల్చాకే కౌన్సెలింగ్ కొనసాగాలని, అప్పటి వరకు ఆపేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ ఆపేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. విధిలేక అధికారులు కౌన్సెలింగ్ నిలిపివేశారు.
కేసులు నమోదు చేయండి..
పెళ్లి కాకపోయినా.. కొందరు తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు సమర్పించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే కౌన్సెలింగ్ హాల్ నుంచి ఇంటి దారి పట్టారు.
పీఆర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల
బదిలీలకు కౌన్సెలింగ్
తప్పుడు స్పౌజ్ సర్టిఫికెట్లు
సమర్పించారంటూ ఆందోళన
సాయంత్రం కౌన్సెలింగ్ నిలిపేసిన
అధికారులు