
సిఫార్సులకే పెద్దపీట
ప్రశాంతి నిలయం/అనంతపురం కార్పొరేషన్: పాలనలో కీలకమైన సచివాలయ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలని, తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కూటమి నేతలు బదిలీలను వేదికగా మార్చుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంలో ఈనెల 25 నుంచి వివిధ విభాగాల్లో పని చేస్తున్న గ్రామ/వార్డు ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి నాయకులు తమ పరిధిలోని సచివాలయాల్లో తమకు కావాల్సిన ఉద్యోగులను తెచ్చుకునేందుకు ప్లాన్ చేశారు.
సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వండి..
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖ ఉంటేనే కోరుకున్న చోటకు బదిలీ సాధ్యమని భావించిన ఉద్యోగులు లేఖల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనితీరు, నిబంధనలన్నీ పక్కనపెట్టి ప్రజాప్రతినిధి సూచన మేరకు ఉద్యోగి కోరుకున్న స్థానానికి బదిలీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో అర్హులు తమకు కావాల్సిన స్థానాలను పొందేందుకు వీలులేకుండా పోయిందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
రిక్వెస్టుతో కోరుకున్న చోటుకు..
544 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా.. 4,373 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 2020 అక్టోబర్లో కొందరు, తరువాత నెల రోజుల వ్యవధిలో మరికొందరు ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంది. అలాగే మ్యూచువల్, స్పౌజ్, హెల్త్ తదితర కారణాలతో ఉద్యోగులు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రిక్వెస్టు అంశాలను సాకుగా చూపి చాలా మంది తాము కోరుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో
‘రాజకీయం’
సిఫార్సు లేఖల కోసం ఎమ్మెల్యేలు,
ఎంపీల ఇళ్లచుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు
శుక్రవారం జరిగిన వార్డు అడ్మిన్ బదిలీల్లో గందరగోళం
కౌన్సెలింగ్ శనివారానికి వాయిదా