
మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయి
హిందూపురం: మార్పుతోనే కుటుంబాలు బాగుపడతాయని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. వంటగది, శుద్ధ జలప్లాంట్, బ్యారక్లు, పరిసరాలు, నిత్యావసరాలు, ఫిర్యాదుల పెట్టె తదితరాలను పరిశీలించారు. ఖైదీల పట్ల తీసుకున్న జాగ్రత్తలను సబ్జైలు అధికారి హనుమప్పతో అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రిమాండ్ ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. ఏ తప్పు చేసి జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి జైలులో ఉంటున్నారు. కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా? లేదా? బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేకపోవడం వల్ల ఎవరైనా ఇంకా జైలులోనే ఉంటున్నారా? అనే వివరాలను ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పునకు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని, తరచూ తప్పులు చేసి జైలుకు వెళుతుంటే కుటుంబ మర్యాదలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. చివరకు పిల్లలను కూడా సమాజంలో చిన్నచూపు చూస్తారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రశాంతయుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు జి.ఆర్.సిద్దు, పార్వతి, సంతోషికుమారి, ఈశ్వరప్ప, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి తదితరులు పాల్గొన్నారు.