
రాప్తాడు: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని దేవనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ (44), ప్రతాప్, అమర్నాథ్, నగేష్... కేఏ50ఏ 9691 నంబర్ గల కారులో మంత్రాలయ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. అక్కడ పూజాదికాలు ముగించుకున్న అనంతరం శుక్రవారం దేవనహళ్లికి తిరుగు ప్రయాణమయ్యారు. రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఘటనలో కారు నడుపుతున్న మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్, అమర్నాథ, నగేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జేఎన్టీయూ విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్
అనంతపురం: జేఎన్టీయూ(ఏ) విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. ఇందు కోసం హైదరాబాద్లోని స్మార్ట్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒప్పందంలో భాగంగా ఎక్స్పీరిన్సియల్ లర్నింగ్, వర్చువల్ ఇంటర్న్షిప్ను విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూ (ఏ) విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా సాఫ్ట్స్కిల్స్ అభ్యసించేందుకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ టూ వీసీ ఆచార్య ఓ.దేవన్న, రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ సి.శోభాబిందు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి, స్మార్ట్ బ్రిడ్జి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీ దేవి సిరా పాల్గొన్నారు.
శభాష్ వర్ణిక!
తాడిపత్రిటౌన్: ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్... గట్టి మేలు తలపెట్టవోయ్’ అన్న గురజాడ అప్పారావు మాటలను 14 ఏళ్ల బాలిక వర్ణిక ఆచరణలో పెట్టి పోలీసులతో శభాష్ అనిపించుకుంది. వివరాలు... గత నెల 30న తాడిపత్రి మండలం అయ్యవారిపల్లికి చెందిన భాస్కర్ నాయక్ తాడిపత్రిలోని మెయిన్ బజార్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో రూ.9వేలు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాంక్ ఖాతా నుంచి నగదు డ్రా అయినా.. ఏటీఎం నుంచి రాలేదు. చాలా సేపటి వరకూ ఆయన అక్కడే వేచి చూశాడు. అయినా డబ్బు రాకపోవడంతో విసుగు చెంది వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అదే ఏటీఎం కేంద్రానికి డబ్బు డ్రా చేసుకునేందుకు యల్లనూరు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన బాలిక వర్ణిక వెళ్లింది. అయితే అప్పటికే ఏటీఎంలో నగదు కనిపించడంతో ఆశ్చర్యపోయిన బాలిక... చుట్టుపక్కల పరిశీలించింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ డబ్బు తీసుకెళ్లి నేరుగా సీఐ సాయిప్రసాద్కు అందజేసింది. లెక్కిస్తే రూ.9వేలు ఉన్నాయి. పోలీస్ విచారణలో ఆ డబ్బు అయ్యవారిపల్లికి చెందిన భాస్కర్ నాయక్దని గుర్తించిన పోలీసులు శుక్రవారం ఆయనను పీఎస్కు పిలిపించి వర్ణిక చేతుల మీదుగా అందజేయించారు. ఈ సందర్భంగా వర్ణికను పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
లేపాక్షి: మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణం ఎదుట శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని ధర్మవరానికి చెందిన లింగారెడ్డి(53)గా గుర్తించారు. లేపాక్షి మండలం బిసలమానేపల్లిలో కూలీ పనులకు వచ్చిన ఆయన పని అనంతరం మద్యం సేవించేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని మద్యం సేవించాడు. మరో బాటిల్ను నిక్కర్ జేబులో ఉంచుకుని వెళుతూ మద్యం దుకాణానికి కూత వేటూ దూరంలో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఉపశమన చర్యలు చేపట్టేలోపు మృతి చెందాడు. మృతుడి వద్ద మద్యం బాటిల్తో పాటు బీడీ కట్టలు, అగ్గిపెట్టె, హాన్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కాగా, కల్తీ మద్యం సేవించడం వల్లనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం కావడంతో మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.