
కూటమి నిర్లక్ష్యం వల్లే సింహాచలం దుర్ఘటన
పెనుకొండ రూరల్: సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దుద్దేబండ గ్రామంలో ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అక్షయ తృతీయ రోజున లక్షలాది మంది భక్తులు స్వామి వారి నిజరూప దర్శనం కోసం వస్తారన్నారు. ముందస్తు ప్రణాళికలు, భద్రత చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. నాసిరకంగా గోడ నిర్మాణ పనులు చేపట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించక పోవడం శోచనీయమని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన ఓ ఘటనలో మృతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందజేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురి మృతి, శ్రీకాకుళంలో తాబేళ్ల మృతి, తిరుపతిలో గోవుల మృతి ఘటనలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు.. హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలపై మాట్లాడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. కార్యక్రమంలో పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహులు, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ గౌతమి, మాజీ మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి, బాబు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సల్లా సూర్యప్రకాశ్ రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, మండల కన్వీనర్ గజేంద్ర, నాయకులు వైశాలి జయశంకర్ రెడ్డి, కొండల రాయుడు, చెన్నకేశవులు, పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు
రూ.కోటి పరిహారం ప్రకటించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్