
చిన్నారులపై కూటమి నిర్దయ
తాడిపత్రి రూరల్: అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం చివరకు చిన్నారులను సైతం ఉపేక్షించడం లేదు. కూటమి ప్రభుత్వ నిర్దయ కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు విలవిల్లాడుతున్నారు. సాధారణంగా వేసవి వచ్చిందంటే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయడం పరిపాటి. ఈ విషయంగా తెలంగాణ ప్రభుత్వం మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకూ అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. ఇందుకు భిన్నంగా ఏపీలో మాత్రం వేసవి సెలవులు ప్రకటించకుండా చిన్నారులపై నిర్దయగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రకరకాల యాప్లతో అంగన్వాడీ టీచర్లను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తాజాగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి పెట్టుకోవాలని, టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల వరకూ అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం జీతాల పెంపుతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలపై అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రభుత్వం మాట లెక్కచేయకుండా చలో విజయవాడ పేరుతో వేలాది మందితో భారీ ధర్నాను చేపట్టారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం జీతాలు పెంచకపోవడమే కాకుండా వేసవి సెలవులు ఇవ్వకుండా అంగన్వాడీలపై కక్ష తీర్చుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉక్కపోత తాళలేక...
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... అంగన్వాడీ కేంద్రాల విషయంగా నిర్దయగా వ్యవహరించడం విడ్డురంగా ఉంది. వేసవి సెలవులు ప్రకటించకపోవడంతో లబ్దిదారులు తప్పనిసరిగా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రయోజనాలు అందకుండా పోతాయి. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులయితే ఉక్కపోత తాళలేక ఏడుస్తుండడంతో వారిని సముదాయించలేక ఆయాలు నానా ఇబ్బంది పడుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవుల మంజూరుపై ప్రభుత్వం ఉదాసీనత
కిషోర్ వికాసం పేరుతో వారంలో రెండు రోజుల సమావేశాలు
ఉక్కపోత తాళలేక ఇబ్బంది పడుతున్న చిన్నారులు
కిశోర వికాసం పేరుతో..
వేసవిలో అంగన్వాడీలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం... కిశోర వికాసం పేరుతో వారానికి రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం మంచిదే అయినా.. వేసవిలో అంగన్వాడీలకు సెలవులు లేకుండా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీలు కన్వీనర్లుగా వారి సెంటర్ల పరిధిలోని కిశోర బాలికలను సర్వే చేసి, వారితో సచివాలయ పరిధిల్లోని ఎఎన్ఎంలు, ఎంఎస్కేలతో కలిసి ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో డ్రాపౌట్, బాల్య వివాహాలపై నష్టాలు, వారికి పుట్టే బిడ్డల అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అదేశించింది. ఎండలు తీవ్ర ప్రభావం చూపే మే మాసం మొత్తం సమావేశాలు నిర్వహించేలా జారీ అయిన ఉత్తర్వులపై ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 5,125 6 ఏళ్ల లోపు
పిల్లల సంఖ్య:1,63,700 మంది
గర్భిణులు: 14,900 మంది
బాలింతలు: 13,100 మంది