
నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు
ధర్మవరం అర్బన్: నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపును అందించవచ్చని విశ్వదీప సేవా సంఘం ఫౌండర్ కోళ్లమొరం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని చంద్రబాబునగర్కు చెందిన పామిశెట్టి గోపాల్(61) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు... మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో మృతుడి నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని భార్య వెంకటలక్ష్మి, కుమారుడు పామిశెట్టి వెంకటరమేష్, వెంకటేష్, అశోక్, కోడళ్లు శివలక్ష్మి, నాగలక్ష్మి, తేజశ్వినికు సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ టి.చంద్రశేఖర్రెడ్డి, మాధవ, జుజారు రఘు, కేశవరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
= హిందూపురం: స్థానిక ముదిరెడ్డిపల్లిలో నివాసముంటున్న శశికుమార్ తండ్రి సత్యనారాయణ (88) బుధవారం మృతి చెందారు. తన మృతి అనంతరం నేత్రాలను దానం చేయాలన్న ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వడంతో మధుగిరి వరదాయిని నేత్ర సంగ్రహణ కేంద్రం ప్రతినిధులు గాయత్రీనారాయణ, హిందూపురం కె.ఎ.శ్రీనివాస్మూర్తి ఫౌండేషన్ నిర్వాహకురాలు జయంతి, మాధవి బాధిత కుటుంబసభ్యులను కలసి మృతుడి నేత్రాలను సేకరించి, బెంగళూరులోని డాక్టర్ రాజ్కుమార్ నేత్రదాన కేంద్రానికి పంపారు.
పట్టాలపై యువకుడి మృతదేహం
రాప్తాడు: స్థానిక జేఎన్టీయూ మార్గంలోని పండమేరు రైల్వే బ్రిడ్జి సమీపంలో పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం జీఆర్పీ ఎస్ఐ దేవదాసు అక్కడకు చేరుకుని పరిశీలించారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు నలుపు రంగు నైట్ప్యాంట్, కాఫీ రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు. తల పూర్తిగా ఛిద్రమై మొండెం మాత్రమే మిగిలి ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
10 నుంచి ‘దుర్గం’లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి కె.నరసింహారెడ్డి తెలిపారు. ఉత్సవాల షెడ్యూల్ను ఆయన బుధవారం వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న కలశస్థాపన, రక్షాబంధనం, 11న ధ్వజారోహణ, సింహ వాహనోత్సవం, 12న సూర్యప్రభ వాహనం, 13న శ్రీవారి శేష వాహనోత్సవం, 14న హనమద్ వాహనం, 15న కల్యాణోత్సవం, గరుడ వాహనోత్సవం, 16న గజేంద్ర వాహనం, 17న ఉదయం మడుగుతేరు, సాయంత్రం బ్రహ్మ రథోత్సవం, 18న పార్వేట ఉత్సవం, అశ్వ వాహనం, బాణాసంచా వేడుక, 19న వసంతోత్సవం, మయూర వాహనం, 20న సప్త ప్రాకారోత్సవం, శయనోత్సవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు