
ఐకమత్యంతోనే దేశాన్ని కాపాడుకోగలం
అనంతపురం కల్చరల్: కులమతాలకతీతంగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఐక్యమత్యంతోనే దేశాన్ని కాపాడుకోగలమని మైసూరు దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. మూడు రోజులుగా అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న జ్ఞానసాగర దత్తాంజనేయ క్షేత్రంలో సాగుతున్న విగ్రహ పునఃప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాగిన మహాకుంభాభిషేక వేడుకలకు గణపతి సచ్చిదానంద స్వామీజీ విశిష్ట అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. పెహల్గాం ఉగ్రదాడిలో అశువులు బాసిన వారికి నివాళులర్పించి, వారి కుటుంబాలకు మనమందరం మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ముష్కరులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు వివక్ష, వైసమ్యాలు మరిచి అందరూ ఏకం కావాలన్నారు. అక్షయ తృతీయ పర్వదిన విశిష్టతను తెలియజేస్తూ దాచుకోవడం అంటే బంగారమో, మరో లోహమో కాకుండా పుణ్యాన్ని సంపాదించుకోవాలని ప్రబోధించారు.అంతకు ముందు స్వామీజీ దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానందతీర్థులతో కలిసి ఆలయంలో జ్ఞానమూర్తి దత్తాత్రేయుడితో పాటూ వివిధ దేవతామూర్తులను పునఃప్రతిష్టించారు.
మైసూరు దత్తపీఠాధిపతి
గణపతి సచ్చిదానంద స్వామీజీ