ఒంటరి జీవితాన్ని తాళలేక రాలిన పండుటాకు | - | Sakshi
Sakshi News home page

ఒంటరి జీవితాన్ని తాళలేక రాలిన పండుటాకు

Apr 30 2025 12:51 AM | Updated on Apr 30 2025 12:51 AM

ఒంటరి జీవితాన్ని తాళలేక రాలిన పండుటాకు

ఒంటరి జీవితాన్ని తాళలేక రాలిన పండుటాకు

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

అనంతపురం: ఒంటరి జీవితంపై విరక్తితో ఓ పండుటాకు రాలిపోయింది. మృతి చెందిన భార్య జ్ఞాపకాలు వెంటాడుతుంటే మలివయస్సులో అర్ధంతరంగా తనువు చాలించాడో ఓ వృద్ధుడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని రెవెన్యూ కాలనీ, షిర్డీనగర్‌లో నివాసముంటున్న కళ్లమడి నరసింహారెడ్డి (90)కి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మను ఉరవకొండ మండలం ధర్మపురి గ్రామానికి చెందిన జయరామిరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. కుమారుడు ప్రభాకరరెడ్డి విజయవాడలోని ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం భార్య మృతి చెందడంతో మానసికంగా కుదేలైన నరసింహారెడ్డి కొంత కాలం విజయవాడలో కుమారుడి వద్ద ఉన్నారు. అయితే తనకు కాలక్షేపం కావడం లేదని, అనంతపురానికి పోతానంటూ పట్టుపడడంతో కుమారుడు కాదనలేకపోయాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా అనంతపురంలోని సొంతింటిలోనే ఒంటరిగా ఉంటున్న నరసింహారెడ్డి బాగోగులు చూసుకునేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేశారు. రెండు నెలలకోసారి కుమారుడు వచ్చి తండ్రి బాగోగులు చూసుకుని కుమారుడు వెళ్లేవారు. కష్ట కాలంలో తనకు తోడుగా భార్య లేదంటూ పలువురితో చెప్పుకుని బాధపడే నరసింహారెడ్డి మంగళవారం ఇంట్లోని హాల్‌లో ఫ్యాన్‌కు పంచతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ప్రభాకరరెడ్డి పిన్నమ్మ వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి తెలిపింది. దీంతో విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన సాయంత్రం ఇంటికి చేరుకుని, బంధువుల సాయంతో తలుపు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి తండ్రి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ సీఐ శాంతిలాల్‌ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

నెట్టికంటుడికి కిలో వెండి బహూకరణ

గుంతకల్లు రూరల్‌: మండలంలోని కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి డి.హీరేహాళ్‌ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన భక్తుడు బి.శ్రీధర్‌రెడ్డి కిలో బరువున్న వెండి సామగ్రిని బహూకరించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

గుంతకల్లు రూరల్‌: స్థానిక కసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వెనుక నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి సూర్యనారాయణ రాజు ఇంట్లో చోరీ జరిగింది. తన కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి ఆయన రెండు రోజలు క్రితం పుట్టపర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రవీణ్‌కుమార్‌, కసాపురం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ.12 వేల నగదు అపహరించినట్లుగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement